Thursday, 31 January 2019

ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నియంత్రించాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  31  ప్లాస్టిక్ సంచుల  వాడకాన్ని  నియంత్రించి వాటి స్థానంలో   పేపర్ సంచులను    వినియోగించాలని  గోలేటి స్పోర్ట్స్ లయన్ క్లబ్ అధ్యక్షుడు మహేంద్రరెడ్డి అన్నారు. గురువారం రెబ్బెన  లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గోలేటి గ్రామంలోని గురువారం వారసంతలో ప్రజలకు   పేపర్ బ్యాగులను అందజేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ సంచుల  వాడకం పర్యావరణానికి తీవ్ర విఘాతంగా మారుతుందని ప్లాస్టిక్ సంచుల  తయారీకి ఉపయోగించే రసాయనాలు మానవాళితో పాటు పర్యావరణానికి తీవ్ర విఘాతం  అని అన్నారు.  కాగితం మట్టిలో కలిసిపోయేందుకు దాదాపుగా నెల రోజుల సమయం సరిపోతుంది. కానీ అదే ప్లాస్టిక్ భూగర్భంలో కలిసి పోయేందుకు 20 మిలియన్ సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అంటే ప్రస్థుతం మనం వాడిపడేసిన,వాడుతున్న ప్లాస్టిక్ భూమిలో కరిగేందుకు ఎన్ని సంవత్సరాలు కావాలి, దీన్ని బట్టి ఏ స్థాయిలో ప్లాస్టిక్ మానవాళికి  పెనుముప్పుగా మారుతుందన్నారు.  పేపర్ బ్యాగుల వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. ప్రజలు కూడా మార్కెట్ కి వెళ్ళినప్పుడు గుడ్డతో కుట్టిన  చేతి సంచి తీసుకోని వెళ్లే అలవాటును పెంపొందించుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు లయన్  భాస్కర్,  లయన్ వీఎస్ఆర్ మూర్తి, లయన్ సత్యనారాయణ,  నాయకులు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

రిటైరయిన కార్మికుడికి ఘన సన్మానం

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  31  సింగరేణి సంస్థలో వివిధ హోదాలలో  30 సంవత్సరాలు 7 నెలల పాటు సుధీర్ఘ కాలం సేవలందించిన శ్రీ  కందుల కేశవ రెడ్డి, పంప్ ఆపరేటర్     పదవి విరమణ సందర్భంగా డోర్లి ఒసిపి.1లో ఘనంగా  సన్మానించారు.  ఈ కార్యక్రమం లో  ప్రాజెక్ట్ అధికారి శ్రీ పురుశోత్తం రెడ్డి  మాట్లాడతూ  " కందుల కేశవ రెడ్డి  శేష జీవితం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.  మరియు టర్మినల్ బెన్ఫిట్స్ ద్వారా వచ్చిన డబ్బులను పొదుపు చేసుకొని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. . ఈ కార్యక్రమం లో గని మెనేజర్ శ్రీ ఉమాకాంత్, సేఫ్టీ  అధికారి నారాయణ , పిట్ ఇంజనీర్ జ్ణానేశ్వర్ , ఇంజనీర్లు వసంత్ కుమార్, తేజ, సంక్షేమాధికారి  వేణు, డి వై మేనేజర్లు సుమన్, సునీల్, అండర్ మేనేజర్లు మహేంధర్ రెడ్డి, ప్రశాంత్ జీవన్, సర్వే ఆపీసర్ రామ్మోహన్, జి. ఎం. స్ట్రక్చర్ కమిటీ సభ్యుడు ఎం. సమ్మయ్య ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గోన్నారు.

టి డబ్ల్యూ జె (ఐ జె యు) కేలండర్ ఆవిష్కరణ

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  31  తెలంగాణా యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐ జె  యు) క్యాలెండర్ ను గురువారం   రెబ్బెన  ఎస్సై దీకొండ రమేష్ ఆవిష్కరించారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సమిల్ల సంపత్ కుమార్,  ఆర్గనైజింగ్ సెక్రటరీ  కె.సునీల్ కుమార్,  సంయుక్త కార్యదర్శి డి.శ్రీనివాస్.  పాత్రికేయులు. పోచయ్య, జె  సత్యనారాయణ, సంజీవ్ కుమార్, వినయ్,దాస్ బాబు, చంద్రశేఖర్ లు  గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉత్తమ సేవా అవార్డు అందుకున్న రెబ్బెన ఎస్సై దీకొండ  రమేష్ ను  శాలువా  తో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతలను కాపాడుతూ  పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా రెబ్బెన మండలంలో పలు సేవా కార్యక్రమమాలు నిర్వహించారన్నారు. 

Monday, 28 January 2019

ఫిబ్రవరి 18 న పార్లమెంట్ ముట్టడికి తరలండి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  28  ఫిబ్రవరి 18 న పార్లమెంట్ ముట్టడికి వేలాదిగా విద్యార్థులు తరలి వెళ్లాలని ఏ  ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి  దుర్గం రవీందర్ పిలుపునిచ్చారు. సోమవారం కరపత్రాలను  విడుదల చేసి మాట్లాడారు. గత నాలుగున్నరేళ్లుగా కేంద్ర ప్రభుత్వం విద్యను కాషాయీకరణ  చేస్తున్నదని  , విద్యారంగంలో ఉన్న పలు సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. డిమాండ్ల పరిష్కారానికై   ఫిబ్రవరి 18 న పార్లమెంట్ ముట్టడికి మండలంలోని విద్యార్థులు వేలాదిగా తరలి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  జిల్లా ఉపాధ్యక్షులు పూదరి సాయి, కోశాధికారి కస్తూరి రవీందర్, మండల కార్యదర్శి పర్వతి సాయి, మండల అధ్యక్షులు జాడి సాయి తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ సేవా అవార్డు గ్రహీత రెబ్బెన ఎస్సై దీకొండ రమేష్ కు సన్మానం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  28 ;  గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉత్తమ సేవా అవార్డు అందుకున్న రెబ్బెన ఎస్సై దీకొండ  రమేష్ ను సోమవారం  రెబ్బెన మండల పి  ఆర్ టి యు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్వల  శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల సదానందం , మండల ప్రధాన కార్యదర్శి అనిల్కుమార్లు శాలువా కప్పి   మెమెంటో తో సన్మానించారు. ఈ సందర్భంగా పి  అర్  టి యు డైరీ  క్యాలెండర్లను అందచేశారు. వారు మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతలను కాపాడుతూ  పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా రెబ్బెన మండలంలో పలు సేవా కార్యక్రమమాలు నిర్వహించారన్నారు. వర్షాలతో గుంతలమయంగా రోడ్లను మరమ్మత్తు చేశారని, ముఖ్యంగా యువతను చేదు దారిలోనుంచి మంచి వైపు మరల్చడానికి ఎస్సై  ఎంతో   కృషిచేశారన్నారు. విద్యారుల పట్ల ప్రేత్యేకమైన శ్రద్ధ కనపర్చారన్నారు. ఈ విషయాలను పై అధికారులు గమనించి ఉత్తమ సేవా అవార్డు ఇట్చి ప్రోత్సహహించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్సై దీకొండ  రమేష్ మాట్లాడుతూ మండలంలో 10 వ తరగతి పరీక్షలు వ్రాయబోతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందచేయడానికి కృషిచేస్తున్నామని,వాటిని సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలను రాబట్టాలనిఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కురిపెంగా శ్రీనివాస్, ధర్ము  తదితరులు పాల్గొన్నారు. .

Saturday, 26 January 2019

సింగరేణి సంస్థకు సమిష్టిగా అంకిత భావంతో సహకరించాలి ; జి ఎం కే రవి శంకర్


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  26 ; సింగరేణి సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అధికారులు సమిష్టిగా సింగరేణి పురోభివృద్ధికి పునరంకితం  కావాలని బెల్లంపల్లి రిజనల్ మేనేజర్ కే రవి  శంకర్ అన్నారు.   బెల్లంపల్లి ఏరియాలోని గోలేటిటౌన్ షిప్ లో  శనివారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.   జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతిపిత మహాత్మా గాంధీ, డాక్టర్ బి అర్  అంబెడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళు లర్పించారు. అనంతరం భీమన స్టేడియంలో సింగరేణిఎస్ అండ్ పి ,     సిఐఎస్ఎఫ్ సిబ్బందితో పాటు వివిధ పాఠశాలల విద్యార్థుల గౌరవవందనాన్ని స్వీకరించారు.  అనంతరం  మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ అవసరాలను తీర్చడంలో సింగరేణి కీలకపాత్ర పోషిస్తోందన్నారు దక్షిణ భారతదేశంలోని విద్యుత్ సంస్థలకు  సరిపడా బొగ్గును అందచేస్తూ విద్యుత్ కాంతులు  వెదజల్లేందుకు కృషిచేస్తుందన్నారు.  ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా  సంస్థ పనిచేస్తుందన్నారు.  కారుణ్య నియామకాలను పకడ్బందీగా అమలు చేస్తే కార్మికుల వారసులకు ఉద్యోగులకు అందిస్తుందన్నారు.  అదే తరహాలో కార్మికు  ల  క్వార్టర్ల ఆధునీకరణతో పాటు పూర్తి స్థాయిలో వసతులు కల్పిస్తుందన్నారు.  ఏరియాకు నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని సాధనకు ఉద్యోగులందరూ సహకరించాలని కోరారు.  అనంతరం ఏరియాలో ఎంపికైనా ఉత్తమ కార్మికులను ఘనంగా సన్మానించారు.  ఈ కార్యక్రమంలో సేవా అధ్యక్షురాలు అనురాధశివశంకర్,  డిజిఎం పర్సనల్ కిరణ్ డీవైపీఎంలు సుదర్శనం,  రాజేశ్వర్,  రామశాస్త్రి,  అధికారులు, కార్మిక సంఘాల   అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

పురుగుల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్య

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  26 ; రెబ్బెన మండలంలోని కొమురవెల్లి గ్రామానికి చెందిన పోతురాజుల నాగ స్పందన (17) ఇంటర్ విద్యార్థిని శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై దీకొండ రమేశ్ తెలిపారు.  ఆయన తెలిపిన వివరాల ప్రకారం కొమురవెల్లి గ్రామానికి  చెందిన పోతురాజుల శ్రీనివాస్ సంతోషికుమారిలకు కూతుళ్లు నాగ స్పందన, సాత్విక  ఉన్నారు.  శ్రీనివాస్ గత కొంతకాలంగా మద్యానికి  బానిసై  తాగిన మైకంలో ఇంటికి వచ్చి భార్య సంతోషి కుమారితో పాటు పిల్లలతో తరచూ గొడవలకు దిగుతుండడంతో   మద్యం సేవించటం మానుకుని గొడవలు చేయకుండా ఉండాలని బంధువులతో పాటు కూతుళ్లు సైతం శ్రీనివాస్ కు  ఎన్నోసార్లు నచ్చచెప్పినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.  ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి సైతం మద్యం సేవించి ఇంటికి వచ్చిన అతను భార్యా పిల్లలతో గొడవకు దిగడంతో  తరచుగా తాగిన మైకంలో తండ్రి చేసే గొడవలకు తీవ్ర మనస్తాపానికి గురైన నాగస్పందన  జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉన్న పురుగుల మందు సేవించింది.  గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు తెలిపారు.  మృతురాలి మేనమామ పెద్దింటి మధుకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రేప రెపలాడిన మువ్వన్నెల జెండా



 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  26  గణతంత్ర దినోత్సవం సందర్భంగా   రెబ్బన మండలంలో  మువ్వన్నెల జెండా శనివారం  రెప రెపలాడింది. జాతీపిత  మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీంరావు అంబెడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.రెబ్బెన మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలలో, పాఠశాలల్లో  రిపబ్లిక్ డే ను ఘనంగా నిర్వహించారు. పాఠశాలల విద్యార్థులు ఉదయం మండల కేంద్రంలోని ప్రధాన వీధులగుండా క్రమశిక్షణతో వెళుతూ దేశభక్తి నినాదాలను, దేశ  స్వాతంత్ర్యం కోసం పాటుపడినవారిని స్మరిస్తూ నినాదాలను చేశారు.   . తహశీల్ధార్ కార్యాలయములో డిప్యూటీ  తహశీల్ధార్ నాగోరావ్  , ఎంపిడిఓ కార్యాలములో ఎంపిడిఓ సత్యనారాయణ సింగ్ , ఎం ఈ ఓ ఆఫీసులో  ఎం ఈ  ఓ వెంకటేశ్వర స్వామి  ,  ఐకెపి లో ఏ పీఎం వెంకట రమణ , గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీ, నక్కలగూడా ప్రాధమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కల్వల  శంకర్, మండలంలోని అన్ని పంచాయతీలలో సెక్రటరీలు ,  వివిధ పార్టీ కార్యాలయాల్లో పార్టీ అధ్యక్షులు,  పాఠశాలల్లో ప్రధానోపాద్యాయులు త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు .

Thursday, 24 January 2019

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలి

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  24 ;   రెబ్బెన మండలంలోని  అన్ని పంచాయతీల్లో శుక్రవారం జరిగే పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని రెబ్బెన సర్కిల్ ఇన్సపెక్టర్  రమణమూర్తి పోలీస్ సిబ్బందికి సూచించారు. మండలంలో  ఎన్నికల  విధులు నిర్వహించేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పోలీసుసిబ్బందితో  ఆయన మాట్లాడుతూ మండలంలోని ఇరవై మూడు పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయని ఈ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.  ఎన్నికల సిబ్బందికి తగిన భద్రత కల్పించాలన్నారు.  పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల నిబంధనలను తూచ తప్పకుండా అమలు చేయాలన్నారు.  ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. శాంతి భద్రతలపై  ప్రత్యేకదృష్టి సారించాలన్నారు.  ఎన్నికల నిర్వహణ కోసం ముగ్గురు సిఐలు,  ఐదుగురు  సబ్  ఇన్సపెక్టర్  లు, 120 మంది సిబ్బంది   విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు.  ఎన్నికల సందర్భంగా  ఆవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో  రెబ్బెన సబ్ ఇన్సపెక్టర్   దీకొండ రమేష్ , లింగాపూర్ ఎస్సై  తిరుపతి,  వాంకిడి ఎస్సై చంద్రశేఖర్ లు  ఉన్నారు. 

బాలికల సంరక్షణ ఐసిడిఎస్ సిబ్బంది ధ్యేయం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  24 : బాలికల సంరక్షణ ధ్యేయంగా ఐసిడిఎస్ సిబ్బంది పనిచేయాలని సిడిపిఒ డి  నాగలక్ష్మి అన్నారు గురువారంరెబ్బెన లోని  గోలేటి పంచాయతీ పరిధిలో మూడవ అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో బాలికలపై వివక్షత పెరిగిపోతుందని ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇబ్బందికర  పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందన్నారు.  బాలికల సంరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుందన్నారు.  ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బాలికలకు చేయూతను అందించాలనే లక్ష్యంతో భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమాన్ని చేపట్టి బాలికల సంరక్షణ ప్రాధాన్యతను వివరించారన్నారు.  లింగవివక్షతను నిర్మూలించేందుకు బాలికలకు చిన్నతనం నుండి తాము కూడా బాలురతో  సమానమే అనే  భావాన్ని పెంపొందించడానికి తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు.  పౌష్టిక ఆహారాన్ని తీసుకోవటం ద్వారా బాలికల్లో పెరుగుదల సక్రమంగా ఉంటుందన్నారు.  ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్  డి కిరణ్మయి ,  గ్రేడ్ వన్ సూపర్వేజర్ చిట్టెమ్మ,  సూపర్ వైజర్ సరోజిని దేవి,  అంగన్వాడి టీచర్లు స్వర్ణలత,  సుశీల,  భాగ్యలక్ష్మీ,  రుక్మిణితో పాటు బాలింతలు,  కిశోర బాలికలు తల్లులు పాల్గొన్నారు. 

గంగాపూర్ జాతర వేలం పాట

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  24 : రెబ్బెన  మండలంలో ని   సుప్రసిద్ధ గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల ఇరవై ఏడో తేదీన ఉదయం పన్నెండు గంటలకు జాతర వేలం పాటనిర్వహించనున్నట్లు  ఆలయ ఈవో బాపిరెడ్డి గురువారం తెలిపారు వచ్చే నెల18 వ  తేదీ నుండి మూడు రోజుల పాటు నిర్వహించే జాతర సందర్భంగా ఆలయంలో కొబ్బరికాయలు,  ప్రసాద తయారీ మరియు విక్రయం,  జాతరలో భాగంగా తై  బజార్,  సైకిల్ స్టాండ్ ల  నిర్వహణ వేలం పాట ఉంటాయని  తెలిపారు.  వేలంలో పాల్గొనే వారు ఇరవై వేలు ధరావతు చెల్లించి బహిరంగ వేలం పాటలో పాల్గొనవచ్చని తెలిపారు.  ఈ అవకాశాన్ని ఆసక్తి గల వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు

పంచాయతీ ఎన్నికలకు సిద్ధం



కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  24 : రెబ్బెన మండలంలోని  ఇరవై మూడు గ్రామ పంచాయతీలకు శుక్రవారం జరగబోయే పంచాయతీ ఎన్నికల కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశారు.  గురువారం ఉదయమే ఎన్నికల సిబ్బంది మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయనికి చేరుకుని ఎంపీడీవో సత్యనారాయణ సింగ్  ఆధ్వర్యంలో అధికారులు ఎన్నికల సిబ్బందికి గ్రామ పంచాయతీల వారీగా విధులు కేటాయించ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండల ఇరవై మూడు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా  ఆరు రూట్లలో ఆ ఆరుగురు జోనల్ అధికారులు,  న్యూటన్ పై రెండు బూత్లకు నోటిపై రెండు మంది పోలింగ్ అధికారులు రెండొందల ఇరవై నాలుగు మంది పీవోలు,  ఇరవై మూడు మంది రిటర్నింగ్ అధికారులు,  పన్నెండు మంది కౌంటర్ ఇన్ ఛార్జ్ లు ,   ఆరుగురు అటెండెన్స్ ఇన్చార్జీలు,  ఆరుగురు స్టేజ్ ఇంచార్జీలు  నిర్వహిస్తున్నారన్నారు.  పంచాయితీ వారిగా కేటాయించిన పీవోలకు,  ఓపీ వోలకు అధికారులకు ఎన్నికల సామాగ్రికి అప్పగించారు.  పోలింగ్ బాక్స్ లు తనిఖీ చేసుకొని   కేటాయించిన వాహనాల్లో  పంచాయతీల కు తరలివెళ్లారు.  సిబ్బంది ఎన్నికల్లో విధులు కేటాయింపుతో పాటు సామగ్రి అప్పగింత కార్యక్రమాలను జేసీ రాంబాబు దగ్గర నుండి పరిరక్షించారు సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కృషి చేయాలని అన్నారు.

పశువులకు నట్టల నివారణకు టీకాలు ఎంతో అవసరం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  24 పశువులకు నట్టల  నివారణకు టీకాలు ఎంతో అవసరమని  వాటితో రైతులకు ఎంతో లాభం చేకూరుతుందని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ శంకర్ రాథోడ్ అన్నారు.  గురువారం రెబ్బెన మండలం లోని  ఇందిరా నగర్ లో  పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో నట్టలనివారణ టీకాలను పశు పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు.  జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ శంకర్ రాథోడ్ తో  పాటు ఆదిలాబాద్ జిల్లా డిఎల్డిఎ రాజేశ్వర్లు ఈ శిబిరాన్ని సందర్శించారు.  అనంతరం వారు మాట్లాడుతూ నట్టల  నివారణ టీకాలు పంపిణీ మూలంగా గొర్రెలు మేకలు అంతర్ పరాన జీవుల బెడదను నివారించేందుకు , మరియు  పశువులు మేత పై ఆసక్తి చూపుతాయని తీసుకున్న ఆహారం స సైతం పూర్తిస్థాయిలో జీర్ణమై తుందన్నారు. దీంతో గొర్రెలు మేకలు ఆశించిన పెరుగుదలను సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన మండల  పశువైద్యాధికారి డాక్టర్ సాగర్, విశ్వనాథ్,  సిబ్బంది తదితరలు పాల్గొన్నారు. 

Friday, 18 January 2019

గాలి కుంటు వ్యాధి టీకాలను వేయించాలి

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  18  పశువులకు గాలి కుంటు  వ్యాధి టీకాలను వేయించాలని  ఆసిఫాబాద్ జిల్లా  పశు వైద్యాధికారి డాక్టర్ శంకర్ రాథోడ్ అన్నారు. శుక్రవారం రెబ్బెన మండలం లోని ఎడవెల్లి గ్రామంలో పశువులకు గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలను వేయించడం జరిగిందని అన్నారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ తప్పని సరిగా టీకాలను పశువులకు వేయించాలని అన్నారు. వచ్చే వేసవి కాలంలో పశువుల మేతకోసం ఇబంది పడకుండా గడ్డి జొన్న విత్తనాలను సబ్సిడీ పై మండలాలలో అందుబాటులో ఉంటాయని , వీటి కోసం మండల పశు వైద్యాధికారులను సంప్రదించాలని అన్నారు. జిల్లాలో 20 వ పశు గణన  జరుగుతున్న సందర్హంగా  రైతులు తమ పశువుల వివరాలను ఏరియా విషయం సేకరణ దారులకు తెలియ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సంజీవ్ కుమార్, రెబ్బెన మండల పశు వైద్యాధికారి   సాగర్, సిబ్బంది పాల్గొన్నారు. 

ప్రజలతో మమేకమై ఉన్నత సేవలందించాలి ; ఎస్పీ మల్లారెడ్డి


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  18  ప్రజలతో మమేకమై ఉన్నత సేవలందించాలని జిల్లా ఎస్పీ మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం రెబ్బెన పోలీసు స్టేషన్ను  తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. స్టేషన్ లో  పనిచేస్తున్న సిబ్బంది వివరాలు నమోదు అవుతున్న కేసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది పనితీరుపై, కేసులు పరిష్కారంల అంశాలపై ఆరాతీశారు.  నమోదవుతున్న కేసులను సత్వరమే పరిష్కరించేందుకు సలహాలు సూచనలను అందించారు. సిబ్బందిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రశాంతంగా జరిగేలా చూడాలని సిబ్బందికి సూచించినట్లు తెలిపారు.  అలాగే మండలంలోని నేరాల నియంత్రించడంతో పాటు జరిగిన నేరాల్లో నిందితుల్ని పట్టుకోవడం పట్ల సిబ్బందికి సూచనలు అందించినట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రజలు రాజకీయాల పార్టీలు సైతం పోలీసులకు సహకరించాలని కోరారు. రెబ్బెన పోలీస్టేషన్ పరిధిలో జాతీయ రహదారి వెంట తరచుగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని వాటిని నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.  మద్యం సేవించి వాహనాల నడపకుండా విరివిగా డ్రంకైన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నామని, మీకోసం పోలీసులు కార్యక్రమంలో భాగంగా రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చటంతో పాటు రోడ్డు పక్కన ముళ్ల పొదలను తొలగిస్తున్నట్లు తెలిపారు.  గ్రామాల్లో ప్రజలు అవగాహన కల్పించేందుకు కళాజాత బృందం ద్వారా ప్రత్యేక అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తున్నామన్నారు.  కళాజాత ప్రదర్శన ద్వారా చాలా గ్రామాల్లోని ప్రజలు మద్యానికి దూరం అవుతున్నారని ఇది శుభపరిణామమని అన్నారు.  ప్రజలు నిర్భయంగా స్టేషన్ కు వచ్చి తమ సమస్యలను తెలసుకోవాలని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ సత్యనారాయణ, రెబ్బెన సిఐ వివి రమణమూర్తి ,ఎస్సై దీకొండ రమేష్లతో పాటు తదితర సిబ్బందులు పాల్గొన్నారు.

ఎన్ ఎస్ ఎస్ శిబిరం ముగింపు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  18   రెబ్బెన  మండలంలోని సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల ఎన్  ఎస్ ఎస్ శిబిరం  ముగింపు  రోజు ఇందిరానగర్ పంచాయాతి  లోని నక్కాలగూడా గ్రామంలో  కొనసాగింది. ఈ సందర్భంగా అక్షరాస్యత పై అవగాహనా ర్యాలీ  నిర్వహించారు. అనంతరం నక్కాలగూడా నుండి పొలాలకు వెళ్లే దారికిరువైపులా పేరుకుపోయిన ,  పొదలను శుభ్రం చేశారు.  నక్కలగు డా పాఠశాల విద్యార్థులకు క్విజ్ పోటీ నిర్వహించి  ప్రధమ , ద్వితీయ, తృతీయ బహుమతులను అందచేశారు.    ఈ కార్యక్రమంలో ప్రొగ్రమ్మె ఆఫీసర్ డి దేవాజి,  కాలేజీ ప్రిన్సిపాల్ జాకిర్ ఉస్మాని,   కాగజ్ నగర్  జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీధర్ సుమన్, నక్కలగూడ  పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల  శంకర్,  ,  అధ్యాపకులు పూదరి  మల్లేష్, గణేష్ , స్వప్న,త్రివేణి  ,ఉప్పులేటి  మల్లేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 

యన్ టీ ఆర్ 23వ వర్దంతి పురస్కరించుకొని పూలాభిషేకం


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  18  స్వర్గీయ యన్ టీ ఆర్ 23 వ వర్దంతి పురస్కరించుకొని శుక్రవారం    రెబ్బెన  మండల  కేంద్రంలో మండల తే.దె.పా ఆధ్వర్యంలో ఎన్ టి ఆర్ విగ్రహానికి  జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లులక్ష్మి   పూలమాలలు వేసి  నివాళు లర్పించారు.  ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలుగు దేశం పాలన  హయాంలో తెలంగాణా ప్రాంతం ఎంతో అభివృద్ధి జరిగిందని అన్నారు. బిసి, ఎస్సి,  ఎస్టీ మైనారిటీ ల హక్కుల సాధనలో ఎన్  టి ఆర్ వారి కష్ట సుఖాలలో పాలు పంచుకుని  ఎంతో కృషి చేశారన్నారు. తెలుగు దేశం పేదల పార్టీ అని  రాబోయే రోజుల్లో టిడిపి  జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమములో మండల అధ్యక్షుడు విజయ్, మండల యూత్ అధ్యక్షులు కే శ్రీనివాస్, సంతోష్, బిక్షపతి    తదితరురులు ఉన్నారు .

ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  18 :  రాబోయే కాలంలో దేశవ్యాప్త ఎలెక్షన్లు ఉన్నందున   యువతి యువకులందరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని రెబ్బెన మండల తహసీల్దార్ ఇంతియాజ్ అహ్మద్ శుక్రవారం  ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 2019  నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరు తప్పని సరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఓటరుగా నమోదు చేసుకోవడానికి కావలసిన అన్ని ఫారాలు అందుబాటులో ఉంచామన్నారు. నిర్దేశిత ఫారాలను ఈ నెల 25 లోపు బూత్ లెవల్ అధికారులకు లేదా   తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలన్నారు.ఓటరు జాబితాలో వివరాల  మార్పులు చేర్పులకు  కూడా అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు

జీతాలు అందక పస్తులుంటున్న ఆశా వర్కర్లు


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  18 ; రెబ్బెన మండలం లో పనిచేస్తున్న ఆశా  వర్కర్లకు గత 5 నెలలుగా జీతాలు అందడంలేదని మండల అధ్యక్షులు బి  అనిత, మండల సెక్రటరీ ఎం సుకన్యలు  అన్నారు. శుక్రవారం రెబ్బెన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ  ప్రభుత్వం ఆశ వర్కర్లతో వారికి కేటాయించిన పనులే కాకుండా వివిధ రకాల సర్వే పనులకు  తగిన అదనపు వేతనం అందచేస్తామని  పురమాయించి వారితో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని అన్నారు .ఉదాహరణకు  లెప్రసి సర్వే, ఎలక్షన్ లలో వికలాంగులను పోలింగ్ బూత్ ల వద్దకు తీసుకు వచ్చే భాద్యతను అప్పగించి, తీరా ఎలెక్షన్లు అయిన తరువాత చేసిన అదనపు పనికి పారితోషికం అడిగితె జిల్లా వైద్యాధికారి కార్యాలయం వారు ప్రభుత్వం నుండి డబ్బులు అందలేదని అంటున్నారని ఆరోపించారు. గత 5 నెలలుగా జీతభత్యాలు అందక పస్తులుండవలసిన పరిస్థితి దాపురించిందని కావున ఇకనైనా ప్రభుత్వం తమకు రావలసిన జీతభత్యాలను తక్షణం విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కే రమా దేవి, మండల ఆశావర్కర్లు రాజేశ్వరి, నిర్మల, పద్మ, స్వప్న, కే రాజేశ్వరి, ఎస్ రాజేశ్వరి, సుజాత, భాగ్య, సుజాత, సరోజినీ, లక్ష్మి, విమల, వి పద్మ, అమృత తదితరులు పాల్గొన్నారు.

Thursday, 17 January 2019

ఎన్ ఎస్ ఎస్ ప్రేత్యేక శిబిరం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  17 : రెబ్బెన మండలం ఇందిరా నగర్ లో  రెబ్బన  డిగ్రీ కళాశాల ఎన్  ఎస్ ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిబిరం గురువారం అరవ రోజు కొనసాగింది.  ఈ సందర్భంగా విద్యార్థులు ఇందిరా నగర్  నుండి గొల్లగూడ  దారిలో రోడ్డుపై ఉన్న గుంతలలో మట్టి వేసి ఒక కిలోమీటరు వరకు చదును చేయడం జరిగింది.  ఈ దారిలో వెళ్లే  గ్రామస్తులు విద్యార్థుల సామాజిక సేవను  చూసి విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో  ప్రిన్సిపాల్ జాకీర్ ఉస్మాని, ఎన్ఎస్ఎస్ ఇంచార్జీ దుర్గం దేవాజి ,  అధ్యాపకులు ఉప్పులేటి మల్లేష్,  పూదరి మల్లేష్,  గణేష్,  శ్రీకాంత్,  స్వప్న విద్యార్థులు పాల్గొన్నారు. 

తక్కెళ్లపల్లి సర్పంచ్ ఏకగ్రీవం

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  17 :  రెబ్బెన  మండలంలోని తక్కెళ్లపల్లి గ్రామపంచాయతీ ఎన్నికలలో  గ్రామపంచాయతీ  సర్పంచ్ ను ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఎన్నికల సహాయ అధికారి సత్యనారాయణ సింగ్ గురువారం తెలిపారు. సర్పంచ్ బరిలో మాడే  శంకర్, టేకం  రామయ్య, ఎం లక్ష్మి లు బరిలో ఉండగా గ్రామస్తులు    సర్పంచ్  గా మడేశంకర్ ను,   ఉపసర్పంచిగా ఇందూరి మహేందర్ ను ఎన్నుకున్నారు. వార్డు మెంబర్లుగా ఉప్పల సునీత ,ఉప్పల శంకర్ సుమలత, మహేందర్, సందీప్, వనిత కిష్టయ్య, గంగుల సుమిత్ర లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఘన తంత్ర దినోత్సవ వేడుకలపై సమీక్ష సమావేశం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  17 బెల్లంపల్లి ఏరియా సింగరేణి ఏరియా జీఎం   కార్యాలయంలో గురువారం ఘనతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ రిపబ్లిక్ డే ను  ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అధికారులు, కార్మికులు అధిక సంఖ్యలో   పాల్గొనే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డిజియం సాయిబాబు, డిజిఎం  పర్సనల్ జ్ కిరణ్, శ్రీనివాస్ జి చిన్న బసివిరెడ్డి,  చిన్న బసిరెడ్డి, డి  జిఎం సివిల్ సత్యనారాయణ, ఏ  రాజేశ్వర్,   సుదర్శనం  రామశాస్త్రులు ఉన్నారు

Tuesday, 15 January 2019

సేవ సంస్థ ఆధ్వర్యములో ముగ్గుల పోటీలు


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  15 :  సంక్రాంతి పండుగ సందర్బంగా సంజీవని స్వచ్చంద సేవ సంస్థ  ఆద్వ ర్యములో మంగళవారం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి రోజు న మహిళలు ఇండ్ల ముందు స్వయంగా వేసిన ముగ్గులను సంస్థ సభ్యులు ద్విచక్ర వాహనాలపై ఇల్లు ఇల్లు తిరుగుతూ ఫొటోలు తీశారు . న్యాయ నిర్ణేతలు గా మాన్యం పద్మ. వై సుజాత, దీకొండ విజయ కుమారి  లు వ్యవహరించారు. వారు ఎంపిక చేసిన ముగ్గులకు ప్రథమ , ద్వితీయ , త్రితీయ , కన్సోలేషన్ బహుమతులను గెలిచిన మహిళలకు చీఫ్ గెస్ట్ గా వచ్చిన రెబ్బెన ఎస్ ఐ దీకొండ రమేష్ బహుమతులను అందజేశారు. ఎస్ ఐ రమేష్ మాట్లాడుతూ సంజీవని స్వచ్చంద సేవ సంస్థ పండగా సందర్బంగా మహిళలను ప్రోష్టహించి ముగ్గుల పోటీలు పెట్టడం ఎంతో అభినందనీయమని అన్నారు. సమాజములో సేవ కార్య క్రమాలు మరిన్ని చేయాలని మా ప్రోత్సహం ఎల్లప్పుడూ ఉంటుంది అని అన్నారు. సంస్థ అధ్యక్షుడు , వ్యవస్థాపకులు దీకొండ  సంజీవ్ కుమార్ మాట్లాడుతూ సమాజములో  సేవ చేయాలనే ఆలోచనతో , లక్ష్యం తో సేవ సంస్థను స్థాపించామని.  సంస్థ ఆధ్వర్యములో రెబ్బెన  డిగ్రీ కాలేజ్  తహసీల్దార్ తో విద్యార్థులకు ఓటు హక్కు పై అవగాహన కల్పించామని, రెబ్బెన ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్ల పంపిణీ, హరితహారం లో భాగంగా చెట్లు నాటడం జరిగిందని అన్నారు.  అంగన్వాడీ కేంద్రములో చెట్లు నాటాము. శ్రీరామ నవమి రోజు న సీతారాముల కళ్యాణములో  సంస్థ వాలంటరీ గా పని చేశామని తెలిపారు .  త్వరలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తామని,  సేవ కార్యక్రమాలు చేయాలనే దృఢ నిశ్చయముతో ఉన్నామని, అందరి సహాయ సహకారాలు కావాలని అన్నారు. సంస్థ సహాయ కార్యదర్శి పర్వతి సాయి కుమార్, ట్రెజరర్ డి సాయితేజ , న్యాయ నిర్ణేత మాన్యం పద్మ , సభ్యులు విజయ కుమారి, సుజాత  తో పాటు మహిళలు పాల్గొన్నారు. 



Sunday, 13 January 2019

వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత అందరి భాద్యత

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  13 :   వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత అందరి భాద్యత అని   ప్రోగ్రామ్ ఆఫీసర్ డిదేవాజి  అన్నారు. ఆదివారం రెబ్బెన  మండలంలోని సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల ఎన్  ఎస్ ఎస్ శిబిరం  రెండవ రోజు కొనసాగింది.  ఆదివారం ఇందిరానగర్ గ్రామంలో  నాలాలలో పేరుకు  పోయిన చెత్తా చెదారాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ ఆఫీసర్ డిదేవాజి మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధులు ప్రబల కుండా ఉంటాయని అన్నారు.    గ్రామస్తులకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పూదరి  మల్లేష్, గణేష్ , త్రివేణి,ఉప్పులేటి  మల్లేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 

యువతి యువకులందరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  13 :   యువతి యువకులందరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని రెబ్బెన మండల తహసీల్దార్ ఇంతియాజ్ అహ్మద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 2019  నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరు తప్పని సరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఓటరుగా నమోదు చేసుకోవడానికి కావలసిన అన్ని ఫారాలు అందుబాటులో ఉంచామన్నారు. నిర్దేశిత ఫారాలను ఈ నెల 25 లోపు బూత్ లెవల్ అధికారులకు లేదా   తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలన్నారు.ఓటరు జాబితాలో వివరాల  మార్పులుచేర్పులకు  కూడా అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.

Saturday, 12 January 2019

రెండో రోజు నామినేషన్ల హోరు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  12 : పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు ఊపందుకుంది.  మండలంలోని మొత్తం ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు ఉండగా 214 వార్డ్  స్థానాలలో ఎన్నికలు జరగనున్నాయి.  శుక్రవారం నుండి నానవేసిన ప్రక్రియ ప్రారంభం కాగా మొదటి రోజు సర్పంచ్ స్థానాలకి అధికంగా నామినేసన్ దాఖలు కాగా రెండవ  వార్డ్ స్థానాలకు అధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి.  మండలంలో సర్పంచ్ స్థానానికి ముప్పై రెండు నామినేషన్లు దాఖలు కాగా వార్డ్ స్థానాలకు నూట ఇరవై రెండు నామినేషన్లు దాఖలయ్యాయి.  రెండు  రోజుల్లో సర్పంచ్ స్థానానికి మొత్తం యాభై నాలుగు నామినేషన్లు వార్డ్ స్థానాలకు నూట నలభై రెండు నామనేషన్లు దాఖలు అయినట్లు ఎంపీడీవో ఎం పి  డి ఓ సత్యనారాయణ సింగ్ తెలిపారు.

పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో నిబంధనల విరుద్దంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  12 :  పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని గోలేటి 1వ వార్డు  పోటీ అభ్యర్థి కడతల సాయి డిమాండ్ చేసారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం ఎంపీడీవో సత్యనారాయణ సింగ్ కి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం గోలేటి 1వ వార్డు  స్థానానికి అధికార పార్టీకి చెందిన గోగులోత్  రవినాయక్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఇరవై అయిదు మందితో నామినేషన్ కేంద్రంలోకి వెళ్లి నామినేషన్ దాఖలు చేయటం జరిగిందన్నారు ఎన్నికల నిబంధనలు సక్రమంగా అమలు చేయాల్సిన రిటర్నింగ్ అధికారులు  అవేవి పట్టించుకోకుండా పూర్తి సహకారం అందించారని ఆరోపించారు దీనికి తోడుగా గోలేటి పంచాయతీ కార్యదర్శి సైతం నామినేషన్ దాఖలులో భాగస్వామ్యం అవ్వటం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్నారు . వెంటనే అధికారులు స్పందించి రవినాయక్ అభ్యర్థి అభ్యర్థిత్వాన్ని రద్దు చేసి నిబంధనలకు వి విధులు నిర్వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ విషయంపై ఎంపీడీవోను వివరణ త్వరగా ఎన్నికల కేంద్రం లోని ఎన్నికల  సిబ్బందికి ఏదో అవసరం ఏర్పడితే పంచాయతీ సెక్రెటరీ శంకర్ కేంద్రం లోపలికి వెళ్లాడు. అదే విదంగా రవినాయక్ దాఖలు చేసే  సమయంలో ఇతర అభ్యర్థులు సైతం నామినేషన్స్ వేసేందుకు కేంద్రంలోకి వచ్చారే తప్పా 25 మంది తో వెళ్లలేదని తెలిపారు . 

Friday, 11 January 2019

ప్రాణాలు తీసిన అడవి జంతుల వేట

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  11 :   అడవి జంతువులకు హతమార్చేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్తు వైరు తన పాలిట యమ శాపంగా మారింది నరేష్ జంతువుల వేట చివరికి అతని ప్రాణాలకే కదిలించింది వివరాల్లోకెళితే రెబ్బెన మండల మండలం   లోని తక్కలపల్లి గ్రామానికి చెందిన కోటా శ్రీనివాస్ (42) వ్యవసాయం చేస్తూ ఖాళీ సమయాల్లో అటవీ జంతువులు వేటాడే అలవాటు ఉన్న ఆయన గురువారం రాత్రి అదే గ్రామానికి చెందిన నంది బసవయ్య, కుప్పాల పోషయ్య, పుప్పాల రాకేష్,  సురేష్ లు  కలిసి నెంబర్ మూడొంతుల ముప్పై ఏడు బై వన్ లో గురువారం రాత్రి అటవీ జంతువులను వేటాడేందుకు పథకం పన్నారు.  దానిలో భాగంగా పులుకుంట శివారులోని భీమన్న గుడి వద్ద గల లెవన్ కేపీ విద్యుత్ వైర్లకు బైండింగ్ వైరు ను సహాయంతో అక్కడి నుండి కొంత దూరం వరకు భూమిలో కర్రల గూటాలకు కొట్టి బైండింగ్ పేరును అమర్చారు ఆపై బైండింగ్ వైరుకు విద్యుత్ సరఫరాను అందించి అటవీ జంతువుల కోసం కాపు కాసాగారు అయితే అటవీ జంతువులను హతమార్చేందుకు ఏర్పాటు చేసిన బైండింగ్ వైరు కాస్త ప్రమాదశాత్తు వేటగాళ్ల సమయంలో ఉన్న కోట శ్రీనివాస్కు తగలడంతో విద్యుత్ షాక్కు గురై అతను అక్కడికక్కడే మృతి చెందాడు శుక్రవారం ఉదయం పులుకుంట శివారులో విద్యుత్ శాఖకు గురై ఒక వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో లైన్ఇన్స్పెక్టర్ వేముల సురేష్ కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు మృతుడు కాలికి చేతికి విద్యుత్ షాక్ గురై గాయాలు ఉండటంతో పాటు పక్కనే అక్రమంగా ఏర్పాటు చేసిన వైండింగ్ వైరు ఉండటంతో అడవి  జంతువులను వేటాడేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ నిర్ధారించి విచారణలో అసలు విషయం బయటపడింది కాగా మృతుడుకి  భార్య ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు లైన్ స్పెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

మొదలైన పంచాయతీ నామినేషన్ల పర్వం

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  11 :  మొదలైన పంచాయతీ నామినేషన్ల పర్వం. రెబ్బెన మండలంలో శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. సర్పంచ్, వార్డ్ మెంబెర్ పదవుల ఆశావహులు ఎంతో   ఉత్సాహంగా మొదటి రోజు నామినేషన్లు దాఖలు చేశారు.  రెబ్బెన మండలం లో మొత్తం    24 పంచాయతీలు, 214 వార్డ్ లుండగా  ప్రభుత్వ యంత్రాంగం 7 కేంద్రాలలో నామినేషన్ల స్వికరణకు సన్నద్ధమైంది. నామినేషన్ల తొలిరోజు  రెబ్బెన లో సర్పంచ్ స్థానానికి బొడ్డు  ఉజ్వల , పెసర వెంకటమ్మ , బొమ్మినేని అహాల్య దేవి , పి  వరలక్ష్మి  లు దాఖలు చేయగా , వార్డు మెంబర్లు గా  ఉబేదుల్లా , దుర్గ బాయ, జైస్వాల్ వినోద్, అజమేరా రాజేశ్వరి , పివి దుర్గరావు లు నామినేషన్లు దాఖలుచేశారు. కాగా రెబ్బెన మండల కేంద్రములో సర్పంచులుగా 19 నామినేషన్లు, వార్డు మెంబర్లుగా 23 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎన్నికల సహాయ అధికారి , ఎం పి  డి ఓ సత్యనారాయణ సింగ్ తెలిపారు.

Thursday, 10 January 2019

టీయూటీఎఫ్ క్యాలెండర్ల ఆవిష్కరణ



కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  10 :  రెబ్బెన మండలం  ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం  టియుటిఎఫ్ కాలెండర్లను    ప్రధాన ఉపాధ్యాయురాలు స్వర్ణలత  ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా టియుటిఎఫ్ మండల అధ్యక్షుడు సిహెచ్ మొగిలి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తమ వంతు విధులను నిర్వహించినప్పుడే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయన్నారు ఈ కార్యక్రమంలో టియుటిఎఫ్ రెబ్బెన జనరల్ సెక్రటరీ  కామ్రేడ్ జమున దాస్ ,  జిల్లా సంయుక్త కార్యదర్శి అనీష్ అహ్మద్ ,   జిల్లా కార్యవర్గ సభ్యులు బి చంద్రశేఖర్,  మండల మహిళా అసోసియేషన్ సభ్యురాలు శ్రీమతి షబానా బేగం,మరియు  ఉపాధ్యాయులు  పాల్గొన్నారు.

విద్యార్థులు చిన్ననాటి నుంచే పోటీతత్వాన్నిపెంపొందించుకోవాలి



కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  10 :  విద్యార్థులు చిన్ననాటి నుంచే పోటీతత్వాన్ని పెంపొందించుకుని చదువుపై ఆశక్తి చూపించి  ఉన్నత శ్రేణికి ఎదగాలని రెబ్బెన మండలం తహశీల్ధార్  ఇంతియాజ్ అహ్మద్  అన్నారు. గురువారం   రెబ్బెన మండలంలోని ఎంపీపీఎస్ నక్కల గూడ ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి  పండుగను పురస్కరించుకొని  పిల్లలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొని  పిల్లలు వేసిన  సంక్రాంతి ముగ్గులు చూసి పిల్లలను అభినందించారు. ప్రథమ, ద్వితీయ_ తృతీయ బహుమతులను అందజేశారు  తహశీల్ధార్   పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ చిన్నప్పటినుండి పిల్లలు భారతదేశ సంస్కృతి, పండుగలు గురించి తెలుసుకోవాలని అన్నారు ,ఇప్పటి నుండే పోటీతత్వం అలవర్చుకొని అన్ని రంగాల్లో  ముందుండేందుకు కృషి చేయాలని తెలియజేశారు  ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వలశంకర్, ఉపాధ్యాయులు దేవరకొండ రమేష్  మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Tuesday, 8 January 2019

చట్ట బద్దమైన కార్మికులసమస్యలను పరిష్కరించాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  08 : చట్ట బద్దమైన కార్మికులసమస్యలను పరిష్కరించాలని బెల్లంపల్లి ఏరియా సింగరేణి జీఎం  కే రవిశంకర్ కు ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులూ  మహమ్మద్ చాంద్ పాషా  ఆధ్వర్యంలో మంగళ వారం  వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా   వారు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను  వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న  కోట్లాది  మంది సంఘటిత, అసంఘటిత కార్మికులు  తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సమాన పనికి సమాన వేతనం  అందించాలని, నెలకు కనీసం 18000/- జీతం అసంఘటిత కార్మిక వర్గానికి అందించాలని, నిత్యవసర సరుకుల ధరలను నియంత్రించి అందుబాటులో  ఉంచుతూ పేదల అవసరాలను తీర్చాలని అనేక సమస్యల పై సమ్మెచేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో చల్లూరి అశోక్, ఏ  బాపు, మైసూర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా భీమన్న జండా పండుగ


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  08 : ఆదివాసీ కోలావార్ మన్నెవార్  ఆరాధ్యదైవం బిమదేవుడి జెండా పండుగను రెబ్బెన లోని  అన్ని కోలావార్ గూడాల్లో ఆయా  గ్రామ కమిటీ   అధ్యక్షుల ఆధ్వర్యంలో జండాలను ఎగరవేసారు .రెబ్బెన మండలం లో పులికుంట రోడ్ గ్రామంలో బిర్సా మారయ్య, పులికుంట కాలనీ లో గువ్వల సత్యనారాయణ, పులికుంట న్యూ కాలనీ లో దుర్గతి నాగయ్య, రేకుల గూడలో చింత మాట్లా నారాయణ, ఇందిరా నగర్ లో కుమ్మరి మల్లేష్, నక్కలా గూడా మీసాల లక్ష్మణ్, నంబాల పూదరి గణపతి, రాజారామ్ పూదరి శంకర్, కొమురవెల్లి మంజరి అశోక్, రాళ్ళపాడు మాది చిన్నయ్య, కొత్తగూడెం కోడిపె వెంకటేశం , ఎం టి ఆర్ నగర్ తెలం రామయ్య, ఖైరుగూడ  కృష్ణ, తుంగేద  నాయిని సంతోష్, ధర్మారం ఆత్రం భీంరావు లు     మన్నెవార్ సంప్రదాయబద్ధంగా డోలు వాయిద్యాలతో నిర్వహించారని రెబ్బెన మండల  ఆదివాసీ మన్నెవార్ సేవా సంఘం అధ్యక్షులు మైలారపు  శ్రీనివాస్ రావు మంగళవారం  తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల ఎనిమిదో తేదీ నుంచి పదిహేడో తేదీ వరకు అన్ని  ఆదివాసీ కో లం గూడల్లో భీమ దేవుడు జెండాలను ఎగురవేసి పండుగ జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దుర్గతి సుధాకర్, మండల ఉపాధ్యక్షుడు కోడిపె వెంకటేశం, మండల కార్యదర్శి బిర్సా పోషయ్యతదితరులు పాల్గొన్నారు. 

అక్రమ అరెస్ట్ లకు నిరసనగా అంబెడ్కర్ విగ్రహానికి వినతి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  08 : నిరసన కార్యక్రమాలకు అనుమతులిచ్చి నాయకులను అక్రమంగా అరెస్ట్    చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులూ మహమ్మద్ చాంద్ పాషా మంగళ వారం రెబెనా మండలం గోలేటిలోని అంబెడ్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ  చేపట్టిన సమ్మెను విచ్ఛిన్నం  చేయడానికి  నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. తక్షణమే బేషరతు గా వారందరిని విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అశోక్, బాపు, కే సాగర్, జ్ శంకర్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.  

Monday, 7 January 2019

దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  07 :  బెల్లంపెళ్లి  ఏరియా లోని కైరుగుడా, డోర్లిలలో సమ్మెను విజయవంతం చెయాలని  ఏఐటీయూసీ,ఐ ఎఫ్ టి యు  ఆధ్వర్యంలో సోమవారం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్,జిల్లా ,ఐ ఎఫ్ టి యు కమిటీ సబ్యులు తిరుపతి, కార్మికులను కలిసి సమ్మెలో పాల్గొనాలని ప్రచారం చేశారు.   దొర్లిలో కార్మికులతో కలిసి సమ్మె వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. అనంతరం కోల్  హ్యాండ్లింగ్  ప్లాంట్  వర్క్ షాప్,స్టోర్ ఏరియా లోని కార్మికులను కలిసి సమ్మెలో పాల్గొనాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధనకై సమ్మె చేయక తప్పడం లేదని, కావున కార్మికులందరూ అధిక సంఖ్యలో సమ్మె లో పాల్గొని కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర , రాష్ట్ర మరియు సింగరేణి సంస్థ యజమాన్యానికికి తగిన బుద్ది   చెప్పాలని కిరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సభ్యులు సాగర్ గౌడ్ ,నాయకులు తిరుపతి,సదయ్య,రాజన్న, ఆశలు,గణపతి, వెంకటేష్,సతీష్,తదితరులు పాల్గొన్నారు.

ఓటు హక్కుపై అవగాహన

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  07 :  రెబ్బెన మండలంలోని ప్రభుత్వ కళాశాలలో మరియు ప్రభుత్వ పాఠశాలలో సోమవారం బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై  అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ  సందర్భంగా  సేవా సంస్థ అధ్యక్షులు ఓరగంటి  రంజిత్ ఓటు హక్కు గురించి విద్యార్థులకు వివరించి  జరగబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ,  ఓటర్లు  డబ్బుకు మందుకు మరియు ఇతర ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీ పరులకు ఓటు వేసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు.   కేవలం ఎలక్షన్లు వచ్చినప్పుడే వచ్చే నాయకుల కన్నా నిజాయితీగా ఉండే నాయకులను ఎన్నుకోవాలని వారు అన్నారు.. ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి మరిన్ని కార్యక్రమాలతో ముందుకు వస్తున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ , పాఠశాల ప్రదనోపాధ్యాయురాలు స్వర్ణలత , సంస్థ   ప్రధాన కార్యదర్శి గజ్జల సత్యనారాయణ ఉపాధ్యక్షులు నామాల రాజశేఖర్,  రవీందర్ , కార్యదర్శులు పెంట పర్తి తిరుపతి , వేల్పుల తిరుపతి,  సభ్యులు రాజశేఖర్ సాయి, కళాశాల ఉపాధ్యాయులు సతీష్,  ప్రకాష్,  అమరేందర్,  మంజుల,  మల్లేశ్వరి,  సంధ్య,  వెంకటేశ్వర్లు,  శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు మోగిలి,  ప్రభాకర్,  సుదేవి చారందస్,  శ్రీదేవి,  పుష్పలత ,చంద్రశేకర్ ,బానేశ్, తుకరం, అనీష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.