ప్రారంభమైన జిల్లా రెండో మహాసభలు
ఆసిఫాబాద్ : పరిపాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని వారు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మీడియం బాబురావు అన్నారు. జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్ లో శనివారం ప్రారంభమైన జిల్లా ద్వితీయ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించి
అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడు సంవత్సరాల పాలనలో ప్రజలను పీల్చిపిప్పి చేశాయని అన్నారు. దేశంలో మత వాదాన్ని రెచ్చగొడుతూ బిజెపి పబ్బం గడుపుకుంటున్నదని అన్నారు. ప్రతి పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదన్నారు. రైతు చట్టాలు, కార్మిక చట్టాలు, విద్యుత్ సంస్కరణలు లాంటి వాటి ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్నో పోరాటాలు చేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కార్మికులకు 8 గంటల పని దినాలు తీసుకువస్తే మోడీ ప్రభుత్వం చట్టాలను సవరించి 12 గంటలకు పెంచిందన్నారు. గడిచిన ఏడు సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం 1256 చట్టాలు సవరించినదన్నారు. పార్లమెంటులో చర్చించి చట్టాలు తీసుకురావాల్సిన ప్రభుత్వాలు ఆర్డినెన్స్ ద్వారా చట్టాలు చేస్తున్నారని ఇది మంచిదికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్లకు కొమ్ము కాస్తుందని దీనికి నిదర్శనమే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పన్ను 31 శాతం నుండి 22 కు తగ్గించారన్నారు. దేశంలో పుట్టిన వ్యక్తులకు వారసత్వం ఇవ్వాల్సిన ప్రభుత్వాలు మత విశ్వాసాల ఆధారంగా ఓటు హక్కు ఇచ్చే విధంగా సీఏఏ చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు. వామపక్ష పార్టీలు ఇతర దేశాలకు మద్దతు పలుకుతానని ఆరోపించడం సరికాదని స్వాతంత్రోద్యమ సమయంలో పూర్తి స్వాతంత్ర్యం కావాలని బ్రిటిష్ వారితో పోరాటం చేసిన పార్టీ తమదేనని గుర్తు చేశారు. ప్రభుత్వం తన వైఫల్యాన్ని కరోనాపై నెట్టుతుందని ప్రజలకు పోషకాహారం అందించడం, టీకా వేయడంలో విఫలమైందన్నారు. మొదటి కేసు నమోదైన కేరళ రాష్ట్రంలో మరణాలు నమోదు కాలేదని దీనికి కారణమే ఆ రాష్ట్రం ప్రజలకు పోషకాహారంతో కూడిన కిడ్స్ అందించడమే కాకుండా, ప్రతి ఒక్కరికి రెండు డోసులు టీకా వేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాన్ని అవలంభిస్తోందని మిగులు రాష్ట్రాన్ని నేడు 41 కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చిందన్నారు. ఉద్యమంతోనే తెలంగాణ రాష్ట్రం కల సాకారం అయిందని నేడు టిఆర్ఎస్ పార్టీ ప్రజా ఉద్యమాలను అణిచివేసే దిశగా పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం రెగ్యులర్ గా జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదని తెలిపారు. రాష్ట్రంలో పోడు సాగుదారుల నుండి దరఖాస్తుల స్వీకరణ కేవలం ఒక తంతు లాగ నడుస్తుందని ఇలా కాకుండా ప్రతి సాగుదారునికి పట్టాలు అందించాలన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి జిల్లా నాయకత్వం పనిచేయాలన్నారు. పార్లమెంటరీ పోరాటాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజా పోరాటాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తెలిపారు. పోడు భూముల పై తీర్మానం ప్రవేశ పెడుతూ జిల్లా సభ్యుడు కోట శ్రీనివాస్ మాట్లాడుతూ 2006లో అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజన సంక్షేమ శాఖ పోడు భూములకు సంబంధించి ప్రముఖ పాత్ర పోషించాలని, కానీ అటవీ అధికారులు వారిపై పెత్తనం చెలాయిస్తున్నారన్నారు ప్రతి పోడుసాగుదారునికి పట్టాలు ఇవ్వకుంటే ప్రభుత్వంపై పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం రాష్ట్ర నాయకుడు జిల్లా ఇన్చార్జి రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి అట్టడుగు స్థాయిలో ఉందని అన్నారు. ఎక్కువ మంది గిరిజనులు నివాసం ఉంటున్న జిల్లాలు విద్య వైద్య సేవలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు ఆ దిశగా కృషి చేయాలని వారిపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత వామపక్ష పార్టీగా తమపై ఉందన్నారు. జిల్లాలో నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసి కార్మికులు కర్షకులు ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. అంతకుముందు పార్టీ సీనియర్ నాయకుడు పస్తం ఆనంద్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు సోమయ్య, మధు, ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకుడు సత్యనారాయణ, జిల్లా కన్వీనర్ కుశాన రాజన్న, జిల్లా కమిటి సభ్యులు అల్లూరి లోకేశ్, కోట శ్రీనివాస్ దుర్గం దినకర్, ముంజం శ్రీనివాస్, గొడిసెల కార్తీక్, నైతం రాజు చాపిలె సాయికృష్ణ భీమేష్ ఉమ్మడి జిల్లా నాయకులు ఎన్.వి. రమణ సతీష్ కుమార్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment